Saturday, 19 March 2016

భారతీయమా .............నువ్వెక్కడ???



                                                భారతీయమా .............నువ్వెక్కడ???



అఖండ భారతావని ప్రపంచ దేశాలలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని ప్రతిష్టించుకొంది...ప్రపంచ దేశాలన్నింటిలో దాదాపుగా ప్రతీ దేశంలోనూ భారతీయులు నివసిస్తున్నారు...స్వాతంత్ర్యానికి పూర్వం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక్కుండా మనకు స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టారు..స్వాతంత్ర్య సంగ్రామంలో చిన్నా,పెద్దా తేడా లేకుండా, ఆడ-మగ అనే లింగ భేదం కూడా లేకుండా ప్రతీ ఒక్కరు తమ రక్తాశ్రువులను చిందించినవారే..అప్పటి రోజుల్లో ప్రాంతీయ తారతమ్యాలు ఉన్నప్పటికినీ తామంతా భారతీయులం అనే భావన నరనరాన జీర్ణించుకున్న వారే ఎక్కువ...ఆ సమయాన మనం ఎవరిని కదిపినా వారిలో భారతీయులం అనే జాతీయ భావన కనిపించేది..నేటి పరిస్థితులందుకు భిన్నంగా వున్నాయి...

                              అప్పటివారు ‘‘నేను మొదట భారతీయున్ని’’ తరువాతే ఇంకేదైనా అనేవారు....కానీ నేడు ప్రాంతీయ భావజాలం పెరిగిపోయింది...మనది అనే మాట మరచి నాది అనే సంకుచిత స్వభావాలు పెల్లుబికి వస్తున్నాయి....ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది జనం నా ఊరు, నామండలం,నాజిల్లా, నారాష్ట్రం, నాప్రాంతం అంటూ ప్రాంతీయభావాలతో పాటుగా నామతం, నాకులం, నావర్గం అన్న సంకుచిత ధోరణిలో బ్రతుకుతున్నారు....అంతేకాకుండా నీది దక్షిణ భారతదేశం, నాది ఉత్తర భారతదేశం అంటూ మనుషుల మనస్సుల్లో గోడలు కడుతున్నారు...ఇంకా చెప్పాలంటే అక్కడెక్కడో ఈశాన్య భారతంలోని ప్రజల గురుంచి పట్టించుకునే నాధుడు చాల సందర్బాల్లో లేరు...ఆ ప్రాంతంల్లో ఒక మహిళ (షర్మిల ఇరోమ్) గత పది సంవత్సరాలుగా దీక్ష చేస్తున్నా ఆమెను పత్రికల వాళ్ళు పలకరించిన సందర్భాలను వేళ్ళపై లెక్కపెట్టవచ్చు....ఆమె గురించి తెలిసిన భారతీ- యులెందరు??....మనకు భారతీయులం అనే భావనలు లేవా???? అంటే ఎందుకు లేవు చాలా పుష్కలంగా ఉన్నాయి...

                       
మన క్రికెట్ టీం పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడుతుంటే మన భారతీయం నరనరాన ఆవహించి టి.వి లకు అతుక్కుపోతాం..మ్యాచ్ గెలిస్తే మనం భారతీయులం అంటూ జాతీయపతాకాలను ఎగురవేస్తూ, కేరింతలు కొడుతూ రోడ్లపై తిరుగుతూ ‘‘భారత్ మాతా కీ జై’’ అంటూ నినాదాలు చేస్తాం...అదే మ్యాచ్ ఓడిపోతే క్రికెటర్లను దుమ్మెత్తిపోస్తూ కొన్ని రోజులు క్రికెట్ చూడొద్దని ఉత్తర ప్రగల్బాలు పలుకుతాం....క్రికెట్ రోజు ఉన్న భారతీయ భావన మిగితా రోజుల్లో ఎక్కడికి వెళ్ళినట్లు...కేరింతలు కొట్టడం, నినాదాలు చేయడం, పతాకం ఎగురవేయడం లాంటివి చేస్తేనే మనం భారతీయులం అనడం లేదు. మనకు ప్రాంతీయ భావనపైన, ఇతర సంకుచిత భావాలపై ఉన్న అభిమానం జాతీయత పైన ఉండాలి .మనం మొదట భారతీయులం ఆ తరువాతే ఇంకేదైనా . స్వాతంత్ర్యం పొంది అరవై వసంతాల పైనే అయినా మన దేశంలో ఎన్నో సవాళ్లు మన ముందున్నాయి...పరతంత్రం పోయి స్వాతంత్ర్యం సంపాదించుకొని దాన్ని సార్థకం చేసుకోకపోతే ఏం లాభం...మన దేశం నా చిన్ననాటి నుండి “అభివృద్ధి చెందుతున్న” దేశాల జాబితాలోనే ఉంది.”అభివృద్ధి చెందిన” దేశాల జాబితాలోకి వెళ్ళాలంటే మనందరికీ భారతీయులం అనే భావన పెరగాలి....భారతీయమా నువ్వేక్కడా????....అని ఎవరి మదిలో అనిపించకుండా.......భారతీయమా నువ్విక్కడే అని ప్రతి ఒక్క భారతీయుడి మదిలో అనిపించాలి.......
జై హింద్

No comments:

Post a Comment